రేవంత్ రెడ్డి తెదేపాకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు మొదలైనప్పటి నుంచి ఈరోజు అయన కాంగ్రెస్ పార్టీలో చేరేవరకు తెరాస నేతలెవరూ నోరు మెదపకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి తెదేపా నుంచి బయటకు వచ్చేసి, కాంగ్రెస్ చేరినప్పటికీ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడలేదు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడం కోసమే తను ఈ నిర్ణయం తీసుకొన్నానని పదేపదే చెపుతున్నారు. అయినా తెరాస నేతలు ఎవరూ స్పందించకపోవడం విచిత్రంగానే ఉంది. బహుశః రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేరికతో రాష్ట్రంలో రాజకీయ బలబలాలను లెక్కకట్టుకొనడంలో బిజీగా ఉన్నారేమో?
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికవలన ఆ పార్టీ బలపడుతుందని తెరాస భావించినా, ఇప్పట్లో బయటపడకపోవచ్చు. యధాప్రకారం రేవంత్ రెడ్డి వంటివారు వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీలో చేరినా దానిని ఎవరూ కాపాడలేరని, తెరాసను ఎవరూ ఓడించలేరని చెప్పుకోవచ్చు. కానీ రానున్న రోజులలో తెరాస మాటలు, చర్యలలో రేవంత్ రెడ్డి గురించి దాని అభిప్రాయం ఏమిటో తెలియవచ్చు.