ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు రాష్ట్ర సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. వైశ్య ప్రజలను కించపరుస్తూ ఆయన వ్రాసిన పుస్తకాన్ని తక్షణం ఉపసంహరించుకొని వైశ్యులకు క్షమాపణ చెప్పాలని లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి ఆయనపై తగినచర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. ఎవరికీ మరొకరిని కులాన్నిబట్టి దూషించే హక్కు లేదు. అలాగే వ్యక్తుల గుణగణాలను కులాలను బట్టి నిర్ణయించలేము. ముఖ్యంగా మేదావులైన వ్యక్తులు ఇటువంటి పనులు చేస్తే సమాజం హర్షించదు. ఐలయ్య చేసినది తప్పేనని భావిస్తున్నాను. కనుక ఆయన తక్షణం వైశ్యులకు క్షమాపణ చెప్పుకొని ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకొంటే ఆయనకే గౌరవంగా ఉంటుంది,” అని అన్నారు.
ప్రొఫెసర్ కంచె ఐలయ్య తన పుస్తకాన్ని..దానిలో వ్రాసిన అంశాలను సమర్ధించుకొంటూ మాట్లాడుతున్న మాటలను రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని పార్టీలు, ప్రభుత్వాలు తప్పు పడుతున్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఐలయ్య ఇంకా రెచ్చిపోతున్నారు. ఈరోజు టీవి-9 ఛానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో స్వామి పరిపూర్ణానందస్వామికి ఆయనకు మద్య తీవ్ర వాగ్వాదాలు జరిగినప్పుడు, పరిపూర్ణానంద స్వామి ఆగ్రహంతో ఆ కార్యక్రమం మద్యలో లేచి వెళ్ళిపోయారు.
ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలియదనుకోలేము. బహుశః ఆయన సూచన మేరకే మంత్రి హరీష్ రావు ఐలయ్యకు ఈ హెచ్చరిక చేసినట్లు బావించవచ్చు. కనుక ఇప్పటికైనా ఆయన వివేకంతో వ్యవహరిస్తే ఆయనకే మంచిది.