తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం అయన హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం నేను కోడంగల్ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే నల్లగొండ లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నాను,” అని తెలిపారు.
నల్లగొండ లోక్ సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తన పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానాన్ని మళ్ళీ గెలిచి చూపించి ప్రతిపక్షాలకు తెరాస సత్తా చాటడానికే ఆయన గుత్తా చేత రాజీనామా చేయించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ, నల్లగొండ లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలు జరుగడం ఖాయమయింది కనుక ప్రతిపక్షాలు కూడా తమ సత్తా చాటుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. ఇంతవరకు కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెదేపా నుంచి రేవంత్ రెడ్డి తమ మనసులో మాట బయట పెట్టారు.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టడం మంచిదని రేవంత్ రెడ్డి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తాను పోటీ చేయాలనుకొంటున్నట్లు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రకటించారు కనుక తనకు కాంగ్రెస్, భాజపా, వామపక్షాలతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరుకొంటున్నట్లు భావించవచ్చు.