తెలుగు సినీ పరిశ్రమలో రోజూ కొత్తగా అనేకమంది హాస్యనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చి జేరుతుండటంతో చివరికి వారి మద్య కూడా పోటీ ఎక్కువయిపోయి అగ్రహీరోలు, దర్శకనిర్మాతల అండదండలున్న వారికే అవకాశాలు దక్కుతున్నాయి. ఆ కారణంగా సీనియర్ హాస్యనటుడు వేణు మాధవ్ కు కూడా సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. బహుశః అందుకే తరువాత ఆప్షన్ గా కనిపిస్తున్న రాజకీయాలలోకి ప్రవేశించడానికి సిద్దం అవుతున్నాడు. ఆయన ఈరోజు ఏపి సిఎం చంద్రబాబును కలిసి తెదేపాలో తన నిర్వహించాల్సిన పాత్ర గురించి మాట్లాడబోతున్నారు. మరొక ఏడాదిన్నరలోగా ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఏపిలో తెదేపా, వైకాపాలు ఇంటింటికీ వెళ్ళి ప్రజలను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నాయి. వైకాపా ఇప్పటికే ఆ పని మొదలుపెట్టేసింది కనుక తెదేపా కూడా మొదలుపెట్టబోతోంది. కేవలం పార్టీ నేతలను, కార్యకర్తలను పంపించడం కంటే జనాకర్షణ ఉన్న తనవంటి సినీ నటీ నటులను వారితో పంపించినట్లయితే ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేయగలమని వేణుమాధవే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలుస్తోంది. ఆ సలహా నచ్చడంతో వేణు మాధవ్ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
అవసరం పడినప్పుడు చంద్రబాబు అందరి సేవలు చాలా చక్కగా ఉపయోగించుకొంటారు. కానీ తీరాక పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కన పడేస్తారని చెప్పేందుకు సీనియర్, జూ.ఎన్టీఆర్, హరికృష్ణ, ఆర్.కృష్ణయ్య, వల్లభనేని వంశీ వంటి అనేక మంది ఉదాహరణలుగా కనిపిస్తుంటారు. భవిష్యత్ లో వేణు మాధవ్ పేరు కూడా ఆ జాబితాలో కనబడుతుందేమో?