ఇటీవల హైదరాబాద్ గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగినప్పుడు, పార్టీని బలోపేతం చేయడం కోసం రాష్ట్రంలో యాత్రలు చేయాలనుకొన్నారు. పిసిస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ‘రాహుల్ సందేశ్ యాత్ర’ చేపట్టాలనుకొంటే, భట్టి విక్రమార్క బడుగుల ఆత్మగౌరవ(పాద)యాత్ర చేయాలనుకొన్నారు. వారిరువురిలో ఎవరు యాత్ర చేయాలనే దానిపై చాలా తర్జనభర్జనలుపడిన తరువాత దానిపై మళ్ళీ చర్చించుకొని నిర్ణయించుకొందామని పక్కన పెట్టేరు.
ఉత్తం కుమార్ రెడ్డి శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, త్వరలో ‘బడుగుల ఆత్మగౌరవ (బస్సు) యాత్ర మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. అంటే అందరూ కలిసి ఒకే బస్సులో పర్యటనకు బయలుదేరుతున్నారన్న మాట. మంచిదే. అలాగే రాహుల్ సందేశ్ యాత్రను దీనితో కలిపివేసినట్లు స్పష్టం అవుతోంది.
పార్టీలో ముఖ్యనేతలు అందరూ కలిసే సమిష్టి యాత్రకు బయలుదేరుతున్నారు కనుక ఇక తమకు దక్కవలసిన క్రెడిట్ ఎవరో కొట్టేస్తారని భయపడనవసరం లేదు.