తెరాస ఎంపి డి శ్రీనివాస్ కుమారుడు అరవింద్ భాజపాలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకొన్నట్లు తాజా సమాచారం. ఆయన భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో డిల్లీలో సమావేశమయ్యారు. ఈ నెల 17న తెలంగాణా విమోచన దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ లో బహిరంగ సభ నిర్వహించబోతోంది. దానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కాబోతున్నారు. ఆయన సమక్షంలో అరవింద్ భాజపాలో చేరాలని నిశ్చయించుకొన్నట్లు సమాచారం. మొదట ఈ బహిరంగ సభను హైదరాబాద్ లో నిర్వహిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. కానీ అకస్మాత్తుగా దానిని నిజామాబాద్ మార్చడానికి బహుశః ఇదే కారణం అయ్యుండవచ్చు.
డి శ్రీనివాస్, ఆయన ఇద్దరు కుమారులు గత కొంతకాలంగా తెరాసకు దూరంగా ఉంటున్నారు. తెరాసలో తాము ఆశించినంతగా గుర్తింపు, ప్రాధాన్యం లభించడంలేదని వారు బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా అరవింద్ భాజపాలో చేరితే తరువాత డిఎస్ కూడా చేరుతారేమో? భాజపాకు నిజామాబాద్ జిల్లాలో బలమైన నేతలు లేనందున ఒకవేళ డిఎస్ కూడా పార్టీ వీడి భాజపాలో చేరినట్లయితే వచ్చే ఎన్నికలలో ఆయన, ఆయన కుమారుడే తెరాసపై పోటీకి దిగవచ్చు.