ఆదివారం జరిగిన కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణాకు చెందిన బండారు దత్తాత్రేయను తప్పించి మురళీధర్ రావు లేదా వేరొకరికి అవకాశం కల్పిస్తారని వార్తలు వచ్చాయి. దత్తన్నను పదవిలో నుంచి తప్పించారు కానీ తెలంగాణా నుంచి ఎవరికీ అవకాశం కల్పించలేదు. అందుకు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికలలో భాజపా 350 ఎంపి సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో కూడా అది ఎంపి సీట్లను పెంచుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఎంపి సీట్లు గెలుచుకోవడం అంత తేలికకాదు కానీ తెరాసతో పొత్తులు లేదా దాని సహకారం పొందగలిగితే సాధ్యమే.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఆకర్షించి జెడియును ఎన్డీయేలోకి రప్పించినట్లుగానే, తెలంగాణాలో బలంగా ఉన్న తెరాసను ఆకర్షించి ఎన్డీయేలోకి రప్పించగలిగితే, దాని సహకారంతో రాష్ట్రంలో భాజపా మరికొన్ని ఎంపి సీట్లు సాధించుకోగలదు. ఒకవేళ దత్తన్న స్థానంలో మరో భాజపా నేతకు అవకాశం కల్పించినా తెలంగాణాలో భాజపా పరిస్థితిలో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం ఉండదు కనుక ఆ స్థానాన్ని తెరాస కోసం అట్టేబెట్టి ఉండవచ్చు.
ఇదివరకు తెరాస ఎంపి కవిత కేంద్రంలో చేరేందుకు ఆసక్తి కనబరచడం, తరువాత పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మనసు మార్చుకోవడం అందరికీ తెలిసిందే. ఒకవేళ భాజపాతో చేతులు కలపడానికి తెరాస ఇష్టపడితే త్వరలోనే జెడియు, అన్నాడిఎంకెలతో బాటు తెరాస ఎంపికు కూడా మంత్రి పదవి లభించవచ్చు లేకపోతే అప్పుడు ఎలాగూ భాజపా నేతలకే ఆ పదవిని కట్టబెట్టవచ్చు.