తమిళనాడు అధికార అన్నాడిఎంకె పార్టీలో ఊహించినట్లుగానే మళ్ళీ కొత్త ఎపిసోడ్ మొదలైంది. శశికళ మేనల్లుడు దినకరన్ 19 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని మంగళవారం ఉదయం గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావును కలిసి తాము పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటున్నామని, కనుక ప్రభుత్వాన్ని రద్దు చేయవలసిందిగా కోరారు. లేకుంటే బలనిరూపణ చేసుకోవలసిందిగా ముఖ్యమంత్రిని ఆదేశించాలని కోరారు.
తమిళనాడు శాసనసభలో మొత్తం 232 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో అధికార అన్నాడిఎంకె పార్టీకి 136 మంది, డిఎంకె పార్టీకి 98 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్: 118.
ఇప్పుడు పళనిస్వామి వెంట ఉన్న ఎమ్మెల్యేలలో నుంచి 19 మంది దినకరన్ వెంట వెళ్ళిపోవడంతో ఆ సంఖ్య 117 కు పడిపోయింది. అంటే ప్రభుత్వం కొనసాగేందుకు ఒక్క సీటు మాత్రమే తక్కువన్న మాట. కనుక మరో ఎమ్మెల్యే మద్దతు సంపాదించుకోవలసి ఉంటుంది. అదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. ఈవిధంగా జరుగుతుందని పళని, పన్నీర్ లకు ముందే ఊహించి ఉంటారు కనుక వారిరువురూ కలిసి దినకరన్ వెనుక ఉన్న ఎమ్మెల్యేలలో వీలైనంతమందిని తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించవచ్చు.