దశాబ్దాలుగా సమైక్య రాష్ట్రాన్ని ఏలిన ఆంధ్రా పాలకులు తెలంగాణా పట్ల, తెలంగాణా ప్రజల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినందునే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగి తెలంగాణా ఆవిర్భావం జరిగిందనే సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా సమైక్య రాష్ట్రాన్ని చిరకాలం పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్ధత, అవినీతి కారణంగానే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పక తప్పదు.
తెలంగాణా ఏర్పడిన కొత్తలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభం, ఆ కారణంగా పరిశ్రమలు మూతపడటం, రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గొప్పగా ఉండి ఉంటే ప్రజలు మళ్ళీ దానికే పట్టం కట్టి ఉండేవారు కదా? కానీ ఎందుకు పక్కన పెట్టారు? అని ఆలోచించకుండా నేటికీ కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వ హయం స్వర్ణయుగం అన్నట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు. మళ్ళీ అధికారంలోకి వస్తామని కలలు కంటుండటం ఇంకా విడ్డూరంగా ఉంది. ఒకవేళ వారు మళ్ళీ అధికారంలోకి రాగలిగితే అది వారి గొప్పదనం కాబోదు. తెరాస ప్రభుత్వంపై ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకత అందుకు కారణం కావచ్చు.