లిక్కర్ స్కాం కేసులో కవితకు న్యాయం జరిగింది అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్పై కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా కేసు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిందంటూ రామన్న కొత్త ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెళ్ళో వేయాలనుకోవడం సిగ్గు చేటు.
అసలు నేను జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కోసమే కదా? పార్టీ కోసం నేను జైలుకి వెళితే రామన్న కానీ, కేసీఆర్గారు గానీ లేదా బీఆర్ఎస్ పెద్ద నాయకులు ఎవరైనా ప్రెస్మీట్ పెట్టి ఇది అన్యాయం అక్రమం అని ఖండించారా? లేదే!
పార్టీ కోసం నేను జైలుకి వెళితే ఎవరూ పట్టించుకోరు. నా తిప్పలు నేనే పడాలి. కానీ పార్టీ ఓడిపోతే దానికి నన్ను బాధ్యురాలిని చేస్తారా? ఇదెక్కడి న్యాయం?
మీ అసమర్థత, వైఫల్యాల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని అందరికీ తెలుసు. కనీసం ఇప్పటికైనా ఓటమికి బాధ్యత తీసుకొని ఒప్పుకుంటే బాగుండేది. కానీ నేటికీ దానిని నా మెళ్ళో వేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. సిగ్గుచేటు,” అని కల్వకుంట్ల కవిత ఘాటుగా బదులిచ్చారు.