ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన హరీష్ రావు, కేటీఆర్ ఇదంతా ట్రాష్, సిల్లీ డ్రామా, లొట్టిపిట్ట కేసు అని తేలికగా కొట్టిపడేస్తుంటే, మాజీ ఐపిఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్లో నేడు మీడియాతో మాట్లాడుతూ, “ఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని దివంగత ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ఆనాడు పార్లమెంటులో చెప్పారు. దేశ భద్రత కోసం నిఘా విభాగాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని, ఈ మెయిల్స్ కూడా స్కాన్ చేస్తుంటాయని చెప్పారు,” అంటూ ఆనాడు డా.మన్మోహన్ సింగ్ పార్లమెంటులో మాట్లాడిన వీడియోని ప్రదర్శించారు.
“డా.మన్మోహన్ సింగ్ ఆ వీడియోలో ఏం చెప్పారంటే, ఉగ్రవాదులను, మనీ లాండరింగ్ ఆర్ధిక నేరాలకు పాల్పడేవారి ఆచూకీ కనిపెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా అవసరమని చెప్పారు,” అని ప్రవీణ్ కుమార్ వివరించారు. ఈ కేసుని రెండేళ్ళుగా విచారణ జరుపుతున్న సిట్ అధికారులు ఒక్క ఆధారం కూడా చూపలేకపోతున్నారని హరీష్ రావు, కేటీఆర్ వాదిస్తుంటే, కేసీఆర్ హయంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం వాస్తవమే. అది తప్పు కాదన్నట్లు ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఇదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను నిలదీయకుండా ఉంటారా?
అయినా దేశ భద్రత, ఆర్ధిక నేరాల కట్టడికి ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చని డా.మన్మోహన్ సింగ్ చెప్పారు తప్ప సొంత, ప్రతిపక్ష పార్టీ నేతలను, న్యాయమూర్తులను, ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను, రియల్ ఎస్టేట్, బంగారు ఆభరణాల వ్యాపారులను, సినీ పరిశ్రమలో వారి ఫోన్లు ట్యాపింగ్ చేయవచ్చని చెప్పలేదు కదా? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత తీవ్రమైన నేరమో తెలిసీ కూడా ఇదో లొట్టిపిట్ట కేసు అంటూ మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.