తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు మండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మాటలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చారు.
“కేసీఆర్ని ఉరి తీయాలంటే నా రక్తం మరిగిపోతోందంటున్న కవితకి మరి హరీష్ రావుని అదే మాట అంటే ఎందుకు స్పందించడం లేదు? కేసీఆర్ సభకు వస్తేనే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని లేకుంటే మనుగడ కష్టమని కవిత చెపుతున్నారు. నేటికీ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఆమె భావిస్తున్నారా? అందుకే బీఆర్ఎస్ పార్టీని బ్రతికించుకోమని కేసీఆర్కు సూచిస్తున్నారా? ఆమె అయోమయంలో ఉన్నట్లున్నారు. కాదంటే బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నానని ఒప్పుకోవాలి.
కేసీఆర్ హయంలో నిర్మించిన పలు ప్రాజెక్టు పనులలో అవినీతి జరిగిందని మేము చెప్పాము. కాళేశ్వరం కమీషన్ కూడా అదే చెప్పింది. వాటిని కేసీఆర్, హరీష్ రావులు ఖండించారు. కోర్టుకి కూడా వెళ్ళారు. కానీ మేము చెప్పిందే కవిత కూడా చెపుతున్నారు కదా? ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని ఆమె ఆరోపిస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ ఎందుకు జవాబు చెప్పడం లేదు?
కేసీఆర్ హయంలో నల్గొండ జిల్లా మంత్రి చేసిన అవినీతిని కవిత బయటపెట్టి నిలదీస్తున్నా జవాబు చెప్పడం లేదు. వారి మౌనాన్ని అంగీకారంగానే భావించవచ్చా?” అని ప్రశ్నించారు.