స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం అర్దరాత్రి ప్రభుత్వం చేతికి వచ్చిన హైకోర్టు తీర్పు ఉత్తర్వులలో అన్ని వర్గాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్స్ మించకుండా పాత పద్దతి ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులలో పేర్కొంది.
బీసీలకు పెంచిన 17 శాతం రిజర్వేషన్స్ ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరుపుకోవచ్చని దానిలో పేర్కొంది.
కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే పాత రిజర్వేషన్స్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు.
ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైనందున, బీసీ రిజర్వేషన్స్ కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. కనుక పాత రిజర్వేషన్స్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దపడవచ్చు.
కానీ అదే సమయంలో బీసీ రిజర్వేషన్స్పై తమకు నిబద్దత ఉందని నిరూపించుకునేందుకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.