తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బీజేపి ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగిస్తే ౪౮ గంటల్లో విచారణ జరిపిస్తానని కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఇన్ని రోజులైనా సీబీఐ కనీసం స్పందించలేదు. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని మాపై ఒత్తిడి చేసిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అంటే ఈ కేసుపై ముందుకు వెళ్ళవద్దని కేటీఆర్ చెప్పడం వల్లనే!
కిషన్ రెడ్డి తెలంగాణ ఎంపీ కానీ హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులు ముందుకు సాగనీయకుండా అడ్డుపడుతున్నారు. అందుకే మేము ఎంతగా చెపుతున్నా ఎల్&టి అధికారులు పనులు మొదలుపెట్టడం లేదు. కిషన్ రెడ్డికి సొంతంగా ఆలోచించే శక్తి లేదు. కేటీఆర్ ఎంత చెపితే అంత... ఎలా చెపితే అలా అన్నట్లు నడుచుకుంటూ మా ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు,” అని సిఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి మాజీ సిఎం కేసీఆర్, ఆయన ప్రభుత్వం, పార్టీపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ హయంలో తెలంగాణలో కూడా 24 లక్షల ఓట్లు తొలగించారు. తెలంగాణలో కూడా ఓట్ల దొంగతనం జరిగింది. కేసీఆర్ కుటుంబంలో నలుగురూ కలిసి ఆడబిడ్డని టార్గెట్ చేసి బయటకు గెంటేశారు. సొంత మనుషులను, సొంత రాష్ట్రాన్ని దెబ్బ తీసిన కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతో బీజేపికి చెందిన కిషన్ రెడ్డి ఎందుకు కుమ్మక్కు అయ్యారు?” అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.