బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేయగానే తెలంగాణ జాగృతి కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ హరీష్ రావు దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ఇందుకు ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కొన్ని చోట్ల కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు, పోస్టర్లను తగులబెట్టారు. కానీ కల్వకుంట్ల కవిత వెంటనే స్పందించలేదు.
ఇది తన రాజకీయ భవిష్యత్తుకు సంబందించిన విషయం కనుక ఆమె తన శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆమె తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడబోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఆమె తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చి, కలిసి వచ్చే పార్టీలతో, తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, భాష, కళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఆయా వర్గాలకు చెందిన మేధావులు, కళాకారులు, ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి బతుకమ్మ పండగతోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కనుక త్వరలో జరుగబోయే బతుకమ్మ పండగని అట్టహాసంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం.
మరి కొన్ని గంటలలో ఎలాగూ కల్వకుంట్ల కవిత ప్రెస్మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడుతారు. ఆమె తన దారి తాను చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం ఉండబోదు.
కానీ నేడు ప్రెస్మీట్ పెట్టి మరోసారి ఏం బాంబులు పేలుస్తారో అని ఆందోళన చెందుతుండవచ్చు. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు, అన్న కేటీఆర్ గురించి కొత్త విషయాలు ఏం చెపుతారో?అని సామాన్య ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.