జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదలైంది. దానిలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఓ డైలాగ్ వైరల్ అవుతోంది.
“నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి.. వీరమల్లు చెప్పింది వినాలి..” అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తారు. ఇప్పుడు ఎన్నికలు లేవు. పైగా ఏపీ డెప్యూటీ సిఎంగా ఉన్నారు. మరో పదేళ్ళపాటు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పని చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు కూడా.
మరైతే ఈ డైలాగ్ ఎవరి కోసం? అంటే ఈ సినిమా ఏపీ ఎన్నికలకు ముందు విడుదలై ఉండి ఉంటే ఖచ్చితంగా ఇది జగన్ని ఉద్దేశించి అన్నదే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఎన్నికలకు వస్తే వైసీపీ నష్టపోతుందని జగన్ చాలా ఆందోళన చెందేవారు. కానీ చివరికి అదే జరిగింది.
ఒకవేళ జగన్ కోసం కాదనుకుంటే తమిళనాడులో అన్నాడీఎంకె, డీఎంకె పార్టీలకు ఈ డైలాగ్ వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకెకి అనుకూలంగా మాట్లాడుతూ, అధికార డీఎంకెపై సనాతన ధర్మ బాణం సందిస్తున్నారు.
కనుక తమిళనాడు అన్నాడీఎంకె, దాంతో కలిసి సాగుతున్న బీజేపి బహుశః పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ రాకూడదని అధికార డీఎంకె కోరుకుంటోంది. కనుక తమిళనాడు రాజకీయాలని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలో ఈ డైలాగ్ జొప్పించారేమో?