బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం టీవీ 5 తెలుగు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరిప్పుడు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా లేదా?” అనే జర్నలిస్ట్ మూర్తి ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఉన్నాననే నేను అనుకుంటున్నాను. ఉన్నానో లేదో బిఆర్ఎస్ పార్టీయే చెప్పాలి.
నేను కేసీఆర్కి వ్రాసిన లేఖని పార్టీలో కొందరు మీడియాకు లీక్ చేయడం వల్లనే నేను బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చింది లేకుంటే ఎప్పటిలాగే మౌనంగా పార్టీలో నాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు, సమస్యలు ఎదుర్కొంటూ కొనసాగుతూనే ఉండేదాన్ని.
ఈవిదంగా వార్తలలోకి ఎక్కడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. కానీ ఇది నా అంతటా నేను చేసిన తప్పు కాదు. ఎవరో చేసిన కుట్ర కారణంగా బయటకు వచ్చి మాట్లాడివలసి వస్తోంది. ఈ నెల రోజులుగా రాజకీయంగా అయోమయంగా అనిపిస్తున్నా నాకు పూర్తి స్పష్టత ఉంది. కానీ బిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికే లేదనిపిస్తోంది. అందుకే నేను అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం చెప్పలేదు.
ఏది ఏమైనప్పటికీ నా నాయకుడు కేసీఆర్. నేను ఆయన నేతృత్వంలో మాత్రమే పనిచేస్తాను. ఆయన చుట్టూ ఉన్న దెయ్యాలు వాటంతట అవి బయటకు వెళ్ళిపోతే మంచిదే. లేకుంటే ఒక్కొక్కరి గురించి మాట్లాడాల్సి వస్తుంది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
రాజకీయ భవిష్యత్ గురించి అడిగిన ప్రశ్నకు సమాచానం చెపుతూ, “ఏ రంగంలో ఉన్నవారైన పైకి ఎదగాలని కోరుకోవడం, ఆ దిశలో ప్రయత్నించడం సహజమే. చాలా అవసరమే.
రేపు మరింత ఉన్నత స్థానంలోకి ఎదుగుతామని నమ్మకంతో పనిచేసినప్పుడే జీవితంలో రాణించగలం. నేను కూడా అంతే.
ఇప్పటికే నేను రాజకీయాలలో చాలా ఎదురుదెబ్బలు తిన్నాను. కానీ ఇంకా చాలా నేర్చుకోవలసి ఉంది. కనుక మరో 10-15 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలనే ఉంది. అప్పటికి తగిన అవగాహన, అనుభవం వస్తాయి కదా?
ప్రస్తుతానికైతే వచ్చే ఎన్నికలలో మా పార్టీ గెలిచి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతారు కూడా.
ఆయన నాకు ఎటువంటి అవకాశం కల్పిస్తే దానిని స్వీకరించి ముందుకు సాగుతాను. కానీ ఢిల్లీ కంటే తెలంగాణలోనే కొనసాగాలని నేను కోరుకొంటున్నాను,” అని కల్వకుంట్ల కవిత చెప్పారు.