పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు విధించగానే పాకిస్థాన్ కూడా భారత్పై ఆంక్షలు విధించింది. వాటిలో భారత్ విమానాలకు తమ గగనతలం మూసివేయడం ఒకటి. దాని వలన భారత్-అమెరికా, యూరోప్, పశ్చిమాసియా దేశాలకు రాకపోకలు సాగించే విమానాలు చుట్టూ తిరిగి ప్రయాణించవలసి వస్తోంది.
కనుక అదనపు గంటల ప్రయాణానికి అదనపు ఇందనం అవసరం పడుతుంది కనుక అందుకు టికెట్ ఛార్జీలు పెంచాల్సివస్తోంది.
మరో 10 రోజులు పాక్ గగనతలం మూసేస్తే భారత్లోని విమానయాన సంస్థలన్నీ దివాళా తీస్తాయని ఆ దేశ మంత్రి హనీఫ్ అబ్బాసీ ఎద్దేవా చేశారు. అయితే ఆయన చెప్పని విషయం మరొకటుంది.
భారత్ నుంచి రోజుకు సుమారు 800 విమానాలు పాక్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుంటాయి. అందుకుగాను వాటి నుంచి రోజుకి సుమారు. 1.20 లక్షల డాలర్లు ఫీజు రూపంలో ముడుతుంటుంది. కనుక పాక్ ప్రభుత్వం పంతానికి పోయి ఇప్పుడు రోజుకి అంత ఆదాయం చేతులరా వదులుకుంటోంది.
గతంలో పుల్వామా దాడి తర్వాత ఈవిదంగా చేసినందుకు 5 నెలల్లో సుమారు వంద మిలియన్ డాలర్లుపై నష్టపోయింది. ఇప్పుడు పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. పైసా ఖర్చు చేయకుండా తేరగా లభిస్తున్న ఈ రోజువారి ఆదాయం వదులుకున్నందున పాకిస్థాన్ పరిస్థితి ఇంకా దయనీయంగా మారుతుంది. కానీ ఈవిషయం బయటకు చెప్పుకోలేరు కనుక పాక్ మంత్రులు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రగల్భాలు పలుకుతున్నారు.
భారత్ కూడా పాక్ విమానాలకు తమ గగనతలం మూసివేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని వలన భారత్ కూడా ఆ మేరకు ఆదాయం కోల్పోయినప్పటికీ పాకిస్థాన్ వంటి ధూర్తదేశంతో ఇటువంటి జాగ్రత్త తీసుకోవడం అవసరమే. లేకుంటే పౌర విమానంతోనే ఉగ్రవాదులు భారత్పై దాడి చేసినా ఆశ్చర్యం లేదు.