జమ్ము కశ్మీర్ ఉగ్ర దాడికి పాక్ ప్రేరిత ఉగ్రవాదమే కారణమంటూ కేంద్ర ప్రభుత్వం ఆ దేశానికి వ్యతిరేకంగా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాక్ ప్రభుత్వం మొదట ఉగ్ర దాడిని ఖండించినప్పటికీ భారత్ ఆరోపణలు, హెచ్చరికలు, నిర్ణయాలకు జవాబుగా క్షిపణి పరీక్షలు నిర్వహించడానికి సిద్దపడుతోంది. నేడు, రేపు కరాచీలో భూమి నుంచి ప్రయోగించే క్షిపణులను పరీక్షించబోతున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.
ఉగ్ర దాడిపై యావత్ భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నందున వారిని శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని పాకిస్థాన్కు తెలుసు. కనుక భారత్ విమర్శలను ఖండించి ఇరు దేశాల మద్య సత్సంబంధాలు నెలకొల్పుకొని ఉగ్రవాదంపై కలిసి పోరాడుదామని విజ్ఞప్తి చేస్తే బాగుండేది.
కానీ కరాచీలో క్షిపణి పరీక్షలు నిర్వహించడమంటే, భారత్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమేనని సంకేతం పంపిస్తున్నట్లే. ఇది ఇరుదేశాల మద్య ఉద్రిక్తతలు, దూరం మరింత పెంచుతుంది. ఇటువంటి సమయంలో పాక్ క్షిపణి పరీక్షలు చేయడం ప్రపంచ దేశాలకు కూడా తప్పుడు సంకేతాలు పంపిన్నట్లవుతుంది కూడా. ఈ కారణంగా ప్రపంచ దేశాలు ఆంక్షలు విదిస్తే నష్టపోయేది పాకిస్థాన్.. ప్రజలే కదా?