ప్రధాని మోడీ నేడు (గురువారం) బిహార్ రాష్ట్రంలో పర్యటించి రూ.13,480 కోట్లు విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
వాటిలో భాగంగా రూ.5,030 కోట్లు వ్యయంతో నిర్మించిన విద్యుత్ పంపిణీ యూనిట్లను ప్రారంభోత్సవం చేస్తారు. గోపాల్ గంజ్ జిల్లాలోని హతువాలో రూ.340 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేస్తారు. దీని ప్రత్యకత ఏమిటంటే ఈ ప్లాంట్ని రైల్వే లైన్తో అనుసంధానం చేశారు. కనుక బిహార్తో సహా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి నేరుగా రైల్వే వేగన్ల ద్వారా ఎల్పీజీ గ్యాస్ రవాణా చేయవచ్చు.
బిహార్లోని సహార్స-ముంబయి మద్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, జయనగర్-పాట్నా మద్య నమో భారత్ ర్యాపిడ్ రైళ్ళకి ప్రధాని మోడీ పచ్చ జండా ఊపి ప్రారంభిస్తారు. కొత్తగా నిర్మించిన కొన్ని రైల్వేలైన్లని ప్రధాని మోడీ జాతికి అంకితం ఇస్తారు.
బిహార్లో సుమారు 2 లక్షల స్వయం సహాయ సంఘాలకు కేంద్ర ప్రభుత్వం తరపున రూ.930 కోట్లు నిధులు విడుదల చేస్తారు.
దేశంలో వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయిన బిహార్ అభివృద్ధికి ప్రధాని మోడీ ఇంత ఉదారంగా నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తుండటం చాలా సంతోషం. కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపి, బిఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయాలను పక్కన పెడితే గత 10-11 ఏళ్ళలో ఏనాడైనా తెలంగాణకు ఇన్ని వేల కోట్లు, ప్రాజెక్టులు మంజూరు చేశారా?
ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లేదా ఎన్డీఏ ప్రభుత్వం మనుగడకు నితీశ్ కుమార్ మద్దతు చాలా కీలకంగా మారినందున బిహార్ రాష్ట్రానికి మాత్రమే నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తుంటారా? దేశంలో అత్యధికంగా పన్ను రాబడి అందిస్తున్న రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇవ్వరా? ఇవ్వకపోయినా బీజేపిని ఆదరించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందా?