జమ్ము కశ్మీర్లో పహల్గామ్ వద్ద పర్యాటకులపై దాడి చేసి చంపిన ఆ ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా తప్పించుకోలేరని, వారిని ఇక ప్రపంచంలో ఏ శక్తి కాపాడలేదని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ అన్నారు.
వారిని వేటాడి పట్టుకొని వచ్చి శిక్షిస్తామని అన్నారు. అంతేకాదు వారిని ఇందుకు ప్రోత్సహించిన వారిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదని, కనుక వారు కూడా భారత్ ఆగ్రహాన్ని చవి చూసేందుకు సిద్దంగా ఉండాలని రాజ్నాధ్ సింగ్ హెచ్చరించారు.
ఉగ్రవాదులు 28 మంది పర్యాటకులని చంపేయడంతో, యావత్ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్పై ఉగ్రవాదులను ఉసి గొల్పుతున్న పాకిస్థాన్కి ఇకనైనా గట్టిగా బుద్ధి చెప్పాలని సామాన్య ప్రజలు మొదలు సినీ ప్రముఖులు వరకు ప్రతీ ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.
దేశప్రజల ఆగ్రహాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈవిదంగా ప్రకటించడం గొప్పగానే ఉంది. కానీ జమ్ము కశ్మీర్లోనే 56 మంది విదేశీ ఉగ్రవాదులు తిష్ట వేసుకు కూర్చున్నారని, అదును చూసి దెబ్బ తీయడం కోసం ఎదురు చూస్తున్నారని ఇంటలిజన్స్ అధికారులు చెపుతున్నారు.
జమ్ము కశ్మీర్లో ఉన్నవారినే పట్టుకోలేకపోతున్నప్పుడు, పాకిస్థాన్ లేదా మరో దేశానికి పారిపోయిన ఉగ్రవాదులను కనుగొని బందించి తీసుకురాగలరా? ఏది ఏమైనప్పటికీ పాకిస్థాన్పై మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు భారత్ సిద్దమవుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.