తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏదో ఓ అంశంపై అధికార కాంగ్రెస్, బీజేపి, బిఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది. రాజకీయాలలో ఇది సర్వసాధారణమే అయినా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చేసిన విజ్ఞప్తి అందరినీ ఆలోచింపజేస్తుంది.
గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి, సంక్షేమ పధకాలు ప్రారంభిస్తే వాటికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందని కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాదిస్తుంటారు. సన్నబియ్యం పంపిణీకి కేంద్రమే ఇచ్చిందంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళుతున్నదెంత?దానిలో నుంచి రాష్ట్రానికి ఇస్తున్నదెంత?వారు చెప్పగలరా? సన్నబియ్యం మీరే ఇస్తున్నామంటున్నారు సరే. మరి మీ బీజేపి పాలిత రాష్ట్రాలలో కూడా ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ ఇవ్వవచ్చు కదా?
కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైన, గౌరవనీయమైన పదవిలో ఉన్న మీరు (కిషన్ రెడ్డి) సోషల్ మీడియాలో ఎవరో ఏదో నకిలీ ఫోటోలు పెడితే నిజానిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా వాటిని సమర్ధించేయడమేనా?విమర్శలు రాగానే వాటిని తొలగించారు కదా?
రాష్ట్రంలో ఎన్నికలయ్యి ఏడాదిన్నర కావస్తోంది. కానీ ఈ ఏడాదిన్నరలో ఏనాడైనా మీరు సిఎం రేవంత్ రెడ్డిని, మంత్రులు, ఎంపీలతో సమావేశమయ్యి తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి అవసరాలున్నాయి? కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవాలి? ఎలా తెచ్చుకోవాలి?అని చర్చించారా?
ఎంతసేపు మతం పేరుతో రాజకీయాలు చేయడం లేదా మజ్లీస్ నేతల భజన చేస్తుండటమేనా?తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే పనులేవీ చేయరా?మజ్లీస్ పార్టీ, మత రాజకీయాలతో ఇంకెంత కాలం కాలక్షేపం చేస్తారు?
మీరిద్దరూ కేంద్ర మంత్రులు. తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా కనీసం మీమీ నియోజకవర్గాలకైనా ఏమైనా చేసి ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవచ్చు కదా?” అని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు.
చౌకబారు విమర్శలు మానుకోండి
— Telangana Congress (@INCTelangana) April 18, 2025
అభివృద్ధి గురించి ఆలోచించండి కిషన్ రెడ్డి గారు
మహేష్ కుమార్ గౌడ్ గారు
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు pic.twitter.com/QdaEPMzSqN