హెచ్‌సీయూ భూములతో పదివేల కోట్ల కుంభకోణం: కేటీఆర్‌

October 11, 2024


img

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సిఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “హెచ్‌సీయూ భూములతో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది. ఇవి అటవీ భూములు అమ్మకానికి తాకట్టు పెట్టడానికి ప్రభుత్వానికి హక్కు లేదు. 

అక్కడ ఎకరా రూ.26,000 మాత్రమే ఉండగా కోకాపేటలో భూముల ధరలని చూపిస్తూ ఇక్కడా ఎకరా రూ.75 కోట్లని నమ్మబలికి బ్యాంక్ నుంచి రూ.10,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. ఆ భూములపై ప్రభుత్వానికి ఎటువంటి యాజమాన్య హక్కు లేదని తెలిసి ఉన్నప్పుడు ఐసిఐసియూ బ్యాంకు వాటిని తనఖా పెట్టుకొని రూ.10,000 కోట్లు ఎందుకు ఇచ్చింది? ఆ సొమ్ము ఎక్కడికి పోయింది?

ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ భూములను అమ్మేసేందుకు సిద్దపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డికి ఓ బీజేపి ఎంపీ ఓ ప్రైవేట్ బ్రోకరేజ్ సంస్థని పరిచయం చేశారు. దాని సాయంతో ఈ భూములు అమ్మేయాలని ప్రయత్నిస్తున్నారు. హెచ్‌సీయూ చుట్టూ ఉన్న 400 ఎకరాలకు ప్రభుత్వం యజమాని కాదు. అని నిరూపించే ఎటువంటి పత్రాలు లేవు. 

కానీ ఓ జీవో, కోర్టు కాపీని చూపిస్తూ అవి ప్రభుత్వ భూములే అని చెప్పుకుంటున్నారు. ఆ భూములతో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది. దీని గురించి కేంద్రానికి, సీబీఐకి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌కి పిర్యాదు చేస్తాం. వీలైతే ప్రధాని మోడీని కలిసి ఈ కుంభకోణం గురించి పిర్యాదు చేసి సీబీఐ విచారణ కోరుతాము,” అని కేటీఆర్‌ అన్నారు.


Related Post