కాంగ్రెస్లో చేరిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, తెలంగాణ ప్రభుత్వానికి, శాసనసభ కార్యదర్శికి, ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపిన సంగతి అందరికీ తెలిసిందే.
వారిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కూడా ఒకరు. ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ఏమన్నారంటే, “నేటికీ నేను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను.
బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. నేను పార్టీ మారలేదు.వీడలేదు. ఏ పార్టీలో చేరలేదు. ఓ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాట వాస్తవం. దానినే మీడియా వక్రీకరించి, నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుగా వ్రాశాయి.
కనుక మీడియా వార్తల ఆధారంగా నాపై అనర్హత వేటు వేయాలని న్యాయస్థానాన్ని కోరడం సరికాదు. నేటికీ నేని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను కనుక నాపై అనర్హత వేటు వేయాలంటూ నా సహచర బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ని కొట్టివేయాలని కోరుతున్నాను,” అని గూడెం మహీపాల్ రెడ్డి సుప్రీంకోర్టుని అభ్యర్ధించారు.
కాంగ్రెస్లో చేరిన మరో ఇద్దరు ముగ్గురు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం సుప్రీంకోర్టులో ఇదేవిదంగా పిటిషన్లు వేశారు. మకి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ని కొట్టివేయాలని సుప్రీంకోర్టుని అభ్యర్ధించారు.
కానీ వారందరూ సిఎం రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రుల సమక్షంలోనే కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారని అందరికీ తెలుసు. సుప్రీంకోర్టుకి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. కానీ వారు తాము బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకుంటున్నారు కనుక లేరని నిరూపించాల్సిన బాధ్యత బిఆర్ఎస్ పార్టీదే అవుతుంది.