సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఆయన బెయిల్ పిటిషన్పై ఇరు పక్షాల వాదనలు ముగిసిన తర్వాత బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
రూ.50,000 చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, అలాగే ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్ళాలని షరతులు విధించింది. కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని షరతులు విధించింది.
ఈ కేసులో అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్ళాలని షరతు విధించడం చూస్తే ఆయన పట్ల న్యాయస్థానం కాస్త కటినంగానే వ్యవహరించిన్నట్లు అనిపిస్తుంది.
అల్లు అర్జున్ కరుడు గట్టిన నేరస్థుడు కాదు. సమాజంలో చాలా గౌరవ మర్యాదలున్నాయి. లక్షల మంది అభిమానులున్నారు. ప్రకృతి విపత్తులు సంభవిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళం అందిస్తుంటారు. ఈ నేపధ్యంలో చూసిననట్లయితే ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్ళాలని షరతు కటినంగానే అనిపిస్తుంది.
అల్లు అర్జున్ నిత్యం సినిమా షూటింగ్లతో చాలా బిజీగా ఉంటారు. వాటి కోసం అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళి వస్తుంటారు. ఖాళీ సమయంలో కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళి వస్తుంటారు. కనుక ప్రతీవారం పోలీస్ స్టేషన్కు వెళ్ళి రావడం ఆయనకు ఇబ్బందికరంగానే ఉంటుంది.
వెళ్ళిన ప్రతీసారి ఆయనని చూసేందుకు పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడుతుంటారు వారిని నియంత్రించడం పోలీసులకు కూడా చాలా ఇబ్బందే.
ఒకవేళ అల్లు అర్జున్ ఆదివారం పోలీస్ స్టేషన్కు వెళ్ళలేని పరిస్థితి ఉంటే ప్రతీసారి పోలీసులనో లేదా న్యాయస్థానం అనుమతో తీసుకోవలసి ఉంటుంది. ఇది కూడా ఓ రకమైన ఇబ్బందే. కనుక అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఈ షరతుని సదలించాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.