మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అంత్య క్రియలు శనివారం ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలో నిగమ్బోధ్ ఘాట్ వద్ద అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించారు.
కొద్ది సేపతి క్రితమే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది. ఢిల్లీలో నిగమ్బోధ్ వద్ద డా.మన్మోహన్ సింగ్ పేరిట ఘాట్ నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది. డా.మన్మోహన్ సింగ్కు ఇటువంటి గౌరవపూర్వకమైన వీడ్కోలు చాలా అవసరమే.
ఈ సందర్భంగా దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. 2020లో తన తండ్రి చనిపోతే కాంగ్రెస్ అధిష్టానం కనీసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి శ్రద్దాంజలి కూడా ఘటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయం తాను కాంగ్రెస్ సీనియర్ నేతలను అడిగితే అటువంటి ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో లేదని అబద్దం చెప్పారని, కానీ తన తండ్రి డైరీలో మాజీ రాష్ట్రపతి కేఆర్. నారాయణన్ చనిపోయినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి శ్రద్దాంజలి ఘటించిన్నట్లు వ్రాసి ఉందని అన్నారు.
అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చనిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం చాలా అనుచితంగా వ్యవహరించిందని, పదేళ్ళపాటు యూపీయే ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ పీవీ షూటింగ్ కట్టించేందుకు ఆసక్తి చూపలేదని శర్మిష్ట ముఖర్జీ ట్వీట్ చేశారు.
తెలంగాణ ముద్దు బిడ్డడు, మహా మేధావి, చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని పార్టీకి దేశానికి ఎంతగానో సేవలు చేసిన పీవీ నరసింహరావు చనిపోయినప్పుడు, ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చేందుకు అంగీకరించలేదు.
కనీసం ఢిల్లీలో ఘనంగా అంత్యక్రియలు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. కనీసం ఆయన అంత్యక్రియలు కూడా కాంగ్రెస్ పార్టీ సక్రమంగా చేయనేలేదు. కానీ ఇప్పుడు డా.మన్మోహన్ సింగ్ చనిపోతే కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ నేతలు చాలా హడావుడి చేస్తున్నారు.
(Courtecy: News18)