రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే పార్టీలు, రాజకీయాలకు అతీతంగా మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బిఆర్ఎస్ నేతలు కూడా హాజరు కావాలని అ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశించారు.
ఆయన ఆదేశం మేరకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్, పార్టీ ఎంపీలు, మరికొందరు ముఖ్యనేతలు నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.
డా.మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో ఆర్ధిక సంస్కరణలు అమలుచేసి దేశ భవిష్యత్నే సమూలంగా మార్చేశారని కేసీఆర్ ప్రశంశించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆయన సహకారం మారువలేనిదని కేసీఆర్ కొనియాడారు. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన డా.మన్మోహన్ సింగ్కు తెలంగాణ ప్రజల తరపున, బిఆర్ఎస్ పార్టీ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని కేసీఆర్ అన్నారు.
సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందరూ వాదిస్తుంటే, డా.మన్మోహన్ సింగ్ వల్లనే తెలంగాణ ఏర్పడిందన్నట్లు కేసీఆర్ మాట్లాడటం ఆలోచింపజేస్తుంది.
నిజానికి ప్రధాని హోదాలో ఆయనకే ఈ క్రెడిట్ దక్కాల్సి ఉండగా అందరూ యూపీయే ప్రభుత్వంలో ఎటువంటి పదవిలోలేని సోనియా గాంధీకి ఆ క్రెడిట్ కట్టబెడుతున్నారు. అయితే యూపీయే హయంలో జరిగిన కుంభకోణాలన్నీటినీ ఆయన పద్దులోనే జమా అయ్యేవి. ఆయన ప్రమేయం లేకపోయినా మౌనంగా చూస్తూ ఉండిపోవటం వలన ఆ బురద ఆయనకే ఎక్కువ అంటుకుంది. ఇది చాలా దురదృష్టకరమే కానీ చేదు నిజం.