పొన్నం పిలిస్తే కేసీఆర్‌ వస్తారా?

December 07, 2024


img

ఈ నెల 9న సచివాలయం ఆవరణలో కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా ఆయన మాజీ సిఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ని పంపిస్తున్నారు.

పొన్నం ప్రభాకర్‌ ఈరోజు మద్యాహ్నం 1.30 గంటలకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కి వెళ్ళి కేసీఆర్‌కి ఆహ్వాన పత్రిక అందించి స్వయంగా ఆహ్వానించనున్నారు. నిన్నే కేసీఆర్‌ సిబ్బందికి ఫోన్ చేసి ఈవిషయం తెలియజేశారు. వారు సూచించిన సమయానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ చేరుకొని కేసీఆర్‌ని కలువబోతున్నారు. 

అయితే తాము రూపొందించి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే సహించబోమని, తాము అధికారంలోకి రాగానే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న విగ్రహాన్ని తొలగించి మళ్ళీ పాత విగ్రహం ఏర్పాటు చేస్తామని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌ చాలా స్పష్టంగా చెప్పారు. 

ఈ నేపధ్యంలో పొన్నం ప్రభాకర్‌ వెళ్ళి పిలిచినా కేసీఆర్‌ వస్తారనుకోలేము. పైగా ఒకవేళ కేసీఆర్‌ ఆయనని కలిసేందుకు అంగీకరిస్తే నిష్కర్షగా తన అభిప్రాయం చెప్పినా ఆశ్చర్యం లేదు. కనుక మంత్రి పొన్నం ప్రభాకర్‌కి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో చేదు అనుభవం ఎదుర్కోకుండా బయటపడగలిగితే అదే పదివేలని సరిపెట్టుకోవాలేమో?


Related Post