డిల్లీ మద్యం కుంభకోణం కేసులో మళ్ళీ చిన్న కదలిక వచ్చింది. ఆ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలతో పలువురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఆ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ వినియోగించని పత్రాలన్నీటినీ నిందితులకు తిరిగి అప్పగించాలని ఢిల్లీ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పుని సవాలు చేస్తూ ఈడీ తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ జరుగుతుండగా దానికి సంబందించి పత్రాలను నిందితులకు అప్పగించడం వలన కేసు విచారణకు అవరోధం కలుగుతుందని కనుక ట్రయల్ కోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే విధించాలని ఈడీ కోరింది.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు అర్వింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఈ కేసుతో సంబందం ఉన్న మరికొందరు నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. అంటే ఇది నిందితులు వేసిన కేసు కనుక కల్వకుంట్ల కవితకి అందిన నోటీసు విషయంలో బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ దిగులు పడాల్సిన అవసరం లేదు.
ఈ కేసులో దాదాపు 6 నెలలు తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత రెండు నెలల క్రితమే బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ పూర్తిగా ఆటకెక్కిపోయిన్నట్లే ఉంది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ కేసులో చిన్న కదలిక వచ్చింది. అది కూడా నిందితులు పిటిషన్ వల్ల కావడం విశేషం.