హైదరాబాద్ శివారు, జన్వాడలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకల తన ఫామ్హౌస్లో శనివారం రాత్రి రేవ్పార్టీ ఇస్తూ పోలీసులకు దొరికిపోవడంపై ముందుగా కేంద్రమంత్రి, బండి సంజయ్ స్పందించారు.
ఆయన ఈరోజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “మాదక ద్రవ్యాల గురించి మాట్లాడితే నాకు లీగల్ నోటీస్ పంపించావు. ఇప్పుడేమంటావ్ కేటీఆర్? అని ప్రశ్నించారు. రేవ్పార్టీలో పాల్గొన్నవారిపై చట్ట ప్రకారం సిఎం రేవంత్ రెడ్డికి నిబద్దత ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
కేటీఆర్కి మాదక ద్రవ్యాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలతో సంబంధం ఉందని ఆరోపించినందుకు బండి సంజయ్కి లీగల్ నోటీస్ పంపారు. దానికి ఆయన జవాబు ఇచ్చేలోగానే కేటీఆర్ బావమరిది రేవ్పార్టీ ఇవ్వడం, ఆ పార్టీలో ఖరీదైన విదేశీ మద్యంతోపాటు నిషేదిత కొకైన్ కూడా పోలీసులకు పట్టుబడటంతో, ఇప్పుడు కేటీఆర్ సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తోంది.
బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బ తీయాలని కాంగ్రెస్ భావిస్తోంది కనుక ఈ కేసు దానికి ఓ చక్కటి అవకాశంగానే భావించవచ్చు. కానీ ఇంతవరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఎవరూ ఈ కేసుపై స్పందించలేదు.
కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉన్నందునే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు ఇవ్వలేదని, ఇప్పుడు ఈ కేసులో కూడా రాజ్ పాకాల, తదితరులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని బండి సంజయ్తో సహా బీజేపీ నేతలు ఆరోపించకుండా ఉండరు. కనుక ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ అవకాశమే కాదు ఇబ్బందికరం కూడా.