భారత్కి ఇటు చైనా అటు పాకిస్తాన్ దేశాలు నిత్యం సవాళ్ళు విసురుతూనే ఉన్నాయి. భారత్ ఏ దేశంపైనా దండయాత్రలు చేసే ఉద్దేశ్యం లేనప్పటికీ రక్షణ రంగంపై భారీగా ఖర్చు చేయాల్సివస్తోంది.
భారత్ ఇప్పటికే మూడు అణు జలాంతర్గామిలను తయారుచేసుకొని వినియోగించుకుంటోంది. తాజాగా ‘అరిధమాన్’ అనే మరో మరో అణు జలాంతర్గామిని చడీచప్పుడూ లేకుండా అక్టోబర్ 16వ తేదీన విశాఖలోని ఈస్ట్రన్ నేవీ కమాండ్ అధ్వర్యంలో సముద్రజలాలలోకి ప్రవేశపెట్టింది.
‘అరిధమాన్’ జలాంతర్గామిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేశారు. ఇది అణుశక్తితో నడుస్తుంది. దీని నుంచి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించి 3,500 కిమీ దూరంలో ఉన్న లక్ష్యాలను నాశనం చేయవచ్చు.
ఇంతకు ముందు తయారుచేసుకొని వినియోగిస్తున్న అరిహంత్ అణు జలాంతర్గామి నుంచి 750 కిమీ దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. ఇప్పుడు దానికంటే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శక్తివంతమైన ‘అరిధమాన్’ జలాంతర్గామి భారత్ నావికాదళానికి లభించింది. దీంతో భారత్ నాలుగు అణు జలాంతర్గామిలు సమకూర్చుకున్నట్లయింది.