ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ గత కొన్ని రోజులుగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్లను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాటిపై వారిరువురూ స్పందించనప్పటికీ టిడిపి మద్దతుదారులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికప్పుడు ఘాటుగా బదులిస్తూనే ఉన్నారు. కానీ ప్రకాష్ రాజ్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.
తాజాగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్ పక్కనే కూర్చున్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి #జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ కంటే ఉదయనిధి స్టాలిన్ చాలా మంచోడు... అందరినీ కలుపుకుపోతారని ప్రకాష్ రాజ్ సూచిస్తున్నట్లుంది. తాను స్టాలిన్తో కలవగలను కానీ పవన్ కళ్యాణ్తో సాధ్యం కాదని సూచించిన్నట్లున్నారు.
మొదట విప్లవభావాలు వ్యక్తం చేసే పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి కాగానే సనాతన ధర్మం అంటూ దీక్షలు చేస్తుండటం, తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సిఎం చంద్రబాబు నాయుడుకి వంత పాడుతుండటం ప్రకాష్ రాజ్ జీర్ణించుకోలేకపోతున్నారని అర్దమవుతూనే ఉంది. కనుక ఈవిదంగా ట్వీట్స్ వేస్తూ అధికారంలో ఉన్న వారిరువురిని రెచ్చగొడుతుంటే, చివరికి నష్టపోయేది తానే అని ప్రకాష్ రాజ్ గ్రహించిన్నట్లు లేదు.