త్వరలో హైడ్రా మూసీనది ఆక్రమణలను తొలగించడానికి సిద్దమవుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. అయితే తమ ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగబోదని, కనుక అక్రమ కట్టడాలు నిర్మించుకున్న ప్రముఖులు తమంతట తామే ఇళ్ళు, ఫామ్హౌస్లు ఖాళీ ప్రభుత్వానికి అప్పగించి సగౌరవంగా తప్పుకోవాలన్నారు. లేకుంటే హైడ్రా వాటిని కూల్చేయడం ఖాయమని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రాజెక్టులు, నదులు, చెరువుల వద్ద కొందరు ప్రముఖులు విలాసవంతమైన ఫామ్హౌస్లు నిర్మించుకొని మురుగు నీటిని వాటిలో వదులుతూ జలాలను కలుషితం చేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మురుగు నీటి కాలుష్యం నల్గొండ వరకు వ్యాపించడం చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
చెరువులు, నాలాలు కబ్జాలు చేసి ఇళ్ళు నిర్మించుకోవడం వలన చిన్న వర్షం పడిన హైదరాబాద్ నగరం నీట మునుగుతోందని తెలిసినా ఎవరూ వెనక్కు తగ్గడం లేదని అందుకే హైడ్రాని ఏర్పాటు చేయాలసి వచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అయితే మూసీ ఒడ్డున సుమారు 11,000 నిరుపేద కుటుంబాల పట్ల తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
బుధవారం పోలీస్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నప్పుడు సిఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ చెప్పారు.