మాదాపూర్ వద్ద ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దాని యజమాని నాగార్జునని, హైకోర్టుని కూడా తప్పు పట్టారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ, “సుప్రీంకోర్టు, హైకోర్టులే అక్రమ కట్టడాలు వెంటనే కూలగొట్టేయమని చెప్పాయి. కానీ తుమ్మిడి కుంట చెరువుని ఆక్రమించి నాగార్జున కట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని అధికారులు కూల్చివేయబోతే హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే స్టే ఇచ్చిన తర్వాత పదేళ్ళు అయినా దానిని హైకోర్టు పట్టించుకోదా?అసలు ఆ కేసు మళ్ళీ బెంచ్ ముందుకు ఎందుకు రాలేదు? రాకుండా ఏ శక్తులు అడ్డుపడ్డాయని నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సూటిగా ప్రశ్నిస్తున్నాను,” అని రఘునందన్ రావు అన్నారు.
చట్టాన్ని గౌరవించే బాధ్యత గల పౌరుడిని, ముందుగా చెపితే తానే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్పించేసే వాడినని నాగార్జున చెప్పడాన్ని కూడా రఘునందన్ రావు ఆక్షేపించారు. తన అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడానికి పదేళ్ళుగా వ్యవస్థలని మేనేజ్ చేసిన నాగార్జున ఇప్పుడు నీతి కబుర్లు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్తో దోస్తీ చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయకుండా ఇంతకాలం కాపాడుకొచ్చిన నాగార్జున ఇప్పుడు నీతి, న్యాయం అంటూ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని రఘునందన్ రావు ఆక్షేపించారు.