కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా విధిలించకపోవడాన్ని తప్పు పడుతూ ‘రేవంతూ ప్రజలు జాడిస్తారు జాగ్రత్త” అంటూ బిఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్పై తెలంగాణ కాంగ్రెస్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. పదేళ్ళలో ఓసారి 11, మరోసారి 9 ఎంపీ సీట్లు, రాజ్యసభ సీట్లు ఇస్తే కేసీఆర్ గులాబీ పూలతో మోడీ పాదాలకు పూజలు చేశారు. అటువంటి బానిసలకు మాట్లాడే అర్హత ఉందా?టిఆర్ఎస్ వద్దు బిఆర్ఎస్ ముద్దు అన్నప్పుడు రాజకీయ ఆరాటమే తప్ప రాష్ట్ర అస్థిత్వం గుర్తుకు రాలేదా!? తెలంగాణ ప్రజల కష్టార్జితంతో పక్క రాష్ట్రాల నాయకులను కొనడానికి దుర్వినియోగం చేసినప్పుడు... రాజకీయ ఆరాటమే తప్ప రాష్ట్ర అస్థిత్వం గుర్తుకు రాలేదా!? తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే… పంజాబ్ రైతుల మెహర్బానీ కోసం అర్రులు చాచినప్పుడు… రాజకీయ ఆరాటమే తప్ప… రాష్ట్ర అస్థిత్వం గుర్తుకు రాలేదా!?” అంటూ ఘాటుగా బదులిచ్చింది.
తెలంగాణ ప్రయోజనాల కోసమే మోడీతో పోరాడుతున్నా అంటూ కేసీఆర్ కత్తులు దూసినా రాష్ట్రానికి లబ్ధి కలుగలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని బడే బాయ్ అంటూ పొగుడుతూ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు విధించలేదు. కానీ ఒకరినొకరు ఈవిదంగా విమర్శించుకుంటే ఏం ప్రయోజనం? ఈ సాకుతో రెండు పార్టీలు రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నాయి. అంతే!