ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నాలుగు నెలలుగా తిహార్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ నీరసించిపోయారు. జైలు అధికారులు ఆమెను ఢిల్లీలోని దీనదయాళ్ ఆస్పత్రికి తీసుకువెళ్ళి చేర్పించారు. వైద్యులు ఆమెకు తగు చికిత్స చేసిన తర్వాత కోలుకున్నారు. ఆస్పత్రిలో సుమారు రెండు మూడు గంటలున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగు పడటంతో జైలు సిబ్బంది ఆమెను తిరిగి జైలుకి తరలించారు.
కల్వకుంట్ల కవిత రెండు బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై జూలై 22వ తేదీన మళ్ళీ విచారణ జరుపనుంది.
ఈ కేసు తెలంగాణ, ఢిల్లీ రాజకీయాలతో కూడా ముడిపడి ఉన్నందున, బయట బీజేపీ-బిఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ సర్దుబాట్లు కూడా జరిగితే తప్ప కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించే అవకాశం ఉండకపోవచ్చు.
నలుగురు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వాటిని కేసీఆర్, కేటీఆర్ ఖండించడం లేదు. రెండు పార్టీల మద్య బహుశః ఆవిదంగా రాజకీయ సర్దుబాటు జరుగుతోందేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.