ఛత్తీస్ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని తప్పుపడుతూ కేసీఆర్ని విమర్శించేవారు అందరూ తెలంగాణ ద్రోహులే అని విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండటం, పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సహాయ నిరాకరణ చేస్తుండటం వలననే కేసీఆర్ అప్పటి ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో నేరుగా మాట్లాడి విద్యుత్ సరఫరాకు ఒప్పందం చేసుకున్నారన్నారు.
ఈ ప్రక్రియ మొత్తం చాలా పారదర్శకంగా జరిగిందని కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమపై రాజకీయ కక్షతోనే దీనిపై జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ చేత విచారణ జరిపిస్తోందని జగదీష్ రెడ్డి అన్నారు. వారి వెనుక కొన్ని ప్రైవేట్ విద్యుత్ సంస్థలు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని వారి ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ నేతలు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం మేలు కోరి తీసుకున్న ఆ నిర్ణయాన్ని తప్పు పట్టే వారందరూ తెలంగాణ ద్రోహులే అని జగదీష్ రెడ్డి అన్నారు.
ఈ వారంలోగా ఆయన కమీషన్ ఎదుట హాజరయ్యి ఛత్తీస్ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై, యాదాద్రి, భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపై సంజాయిషీ ఇవ్వాలని నోటీస్ అందుకున్నారు. తాను తప్పకుండా కమీషన్కు తన వాదనలు వినిపిస్తానని జగదీష్ రెడ్డి చెప్పారు.