బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ఓడిన తర్వాత కడియం శ్రీహరి వంటి పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలలో చేరిపోయారు. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీలో మిగిలిన నేతలు తమ రాజకీయ భవిష్యత్ గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఒకవేళ కేసీఆర్ చెప్పుకున్నట్లుగా లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 12కి పైగా సీట్లు గెలుచుకుని ఉంటే పార్టీలో ఎవరూ ఇంత ఆందోళన చెందేవారు కారు. పార్టీ మళ్ళీ తప్పకుండా మళ్ళీ పుంజుకుంటుందనే నమ్మకం కలిగేది. కానీ లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడటంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆలోచించసాగారు.
వారిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒకరు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే బిఆర్ఎస్ పార్టీని వీడబోతున్నారని వాటి సారాంశం.
ఈ ఊహాగానాలను ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. తాను ఎవరినీ సంప్రదించలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని చెప్పారు. తాను కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తానని చెప్పారు. కానీ పార్టీని వీడే ప్రతీ రాజకీయ నాయకుడు ఇలాగే చెపుతుంటారు కనుక ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలోనే కొనసాగుతారా వీడుతారా? అనేది మరికొన్ని రోజులలో తేలిపోతుంది.