త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్ధులను ప్రకటించడం, టికెట్ ఆశించి భంగపడినవారి అలకలు, ఫిరాయింపులు, బుజ్జగింపుల పర్వం కూడా ముగిసిపోతోంది కానీ కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకు తొలి జాబితా కూడా విడుదల చేయలేకపోయాయి.
కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుతోపాటు రూ.50,000 ఫీజు కూడా చెల్లించినవారున్నారు కానీ బీజేపీలో ఎటువంటి ఫీజూ లేకపోవడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసమే ఢిల్లీకి క్యూకడుతున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.
బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నంత వరకు రాష్ట్రంలో బీజేపీయే దూసుకుపోతుండేది. అయితే ఆయన కారణంగానే ఇతర పార్టీల నేతలెవరూ బీజేపీలో చేరడం లేదని అధిష్టానానికి కొందరు నేతలు పిర్యాదులు చేస్తుండటంతో బీజేపీ అధిష్టానం ఆయనను తొలగించి మృదుస్వభావిగా పేరున్న కిషన్రెడ్డిని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా నియమించింది.
అప్పటి నుంచే రాష్ట్రమలో బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో గెలిచి చాలా ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇదే అదునుగా చురుకుగా పావులు కదుపుతూ రాష్ట్రంలో మళ్ళీ రెండో స్థానంలోకి రాగలిగింది.
అందుకే ఇప్పుడు అందరూ కాంగ్రెస్ టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. కానీ బీజేపీలో ఆ హడావుడి కంపించడం లేదు.