మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింధియా పార్టీ
వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్
అధిష్టానం ప్రకటించింది. కానీ ఈరోజు ఉదయం ఆయన ప్రధాని నరేంద్రమోడీని కలిసిన తరువాత
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి,
వెంటనే తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. పార్టీని
వీడుతున్నట్లు ప్రకటించిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించడం వలన ఎటువంటి ప్రయోజనం
ఉండదని వేరే చెప్పకరలేదు.
ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని కనుక ఎప్పుడైనా ఆయన బిజెపితో చేతులు కలిపే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి చాలా కాలం క్రితమే తెలుసు. కానీ ఎంతో రాజకీయానుభవం ఉన్న ముఖ్యమంత్రి కమల్నాధ్ ఈ సమస్యను తప్పక పరిష్కరించుకోగలరనే నమ్మకంతోనో లేదా ఆయనను కాదని సింధియాకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేని నిస్సహాయత వలననో కాంగ్రెస్ అధిష్టానం ఉపేక్షించింది. తత్ఫలితంగా కాంగ్రెస్ హస్తంలో నుంచి కర్ణాటక తరువాత ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా చేజారిపోనుంది.