ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ఈరోజు ఉదయం ఆయన స్వస్థలం మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కూతురు అమృత తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానానికి వెళ్లినప్పుడు బందువులు అడ్డుకోవడంతో ఆమె తిరిగి వెళ్ళిపోయారు.
అనంతరం ఆమె మిర్యాలగూడలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “అల్లుడిని హత్య చేయించిన మా నాన్న ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాడని నా అభిప్రాయం. అలాగే నా కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చనే వాదన కూడా సరికాదు. ఎందుకంటే ఒకవేళ నేనే కారణమైయుంటే, నేను ప్రణయ్ని వివాహం చేసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినప్పుడే ఆత్మహత్య చేసుకొని ఉండేవారు కదా? నాన్నకు, బాబాయ్తో ఆస్తి గొడవలున్నాయి. నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తరువాత వారిరువురి మద్య గొడవలు జరిగేయని విన్నాను. కనుక ఆస్తి కోసం వారిరువురి మద్య జరిగిన గొడవలు లేదా ప్రణయ్ హత్యకేసులో శిక్ష తప్పదనే భయం చేతనో నాన్న ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని భావిస్తున్నాను. నా భర్తను హత్య చేసినందుకు నాన్నకు ఉరిశిక్ష పడాలని కోరుకొన్నాను. కానీ ఇప్పుడు ఆయన లేరు కనుక ఆ ఇంటికి నేను తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. భర్తను కోల్పోతే కలిగే బాధ నాకు తెలుసు ఒకవేళ నా తల్లి నా దగ్గరకు వస్తే ఆమె బాధ్యతను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను. కానీ మా నాన్న ఆస్తిపాస్తులేవీ నాకు అక్కరలేదు,” అని చెప్పారు.