నిర్భయ దోషులకు డిల్లీ, పటియాలా హౌస్ కోర్టు ఈరోజు మళ్ళీ తాజాగా డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని తీహార్ జైల్ అధికారులను ఆదేశించింది. దీంతో ఒకే కేసులో దోషులకు వరుసగా నాలుగుసార్లు డెత్ వారెంట్లు జారీ చేసినట్లయింది.
వారికి మార్చి 3 ఉదయం 6 గంటలకు ఉరి తీయవలసి ఉండగా, నలుగురు దోషులలో ఒకడైన పవన్ కుమార్ గుప్తా మార్చి 2న రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. దానిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెంటనే తిరస్కరించినప్పటికీ, నిబందనల ప్రకారం 14 రోజుల వరకు ఉరిశిక్షను అమలుచేయడానికి వీలులేదు. ఆ తరువాత అతను మళ్ళీ సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్ వేసుకొనేందుకు కూడా అవకాశం ఉంది దీంతో నలుగురు దోషులకు న్యాయపరమైన మార్గాలన్నీ మూసుకుపోతాయి కనుక డిల్లీ, పటియాలా హౌస్ కోర్టు మార్చి 20 వ తేదీకి ఉరిశిక్షను ఖరారు చేసింది. కోర్టు కేసులు వాయిదా పడటం చూశాము కానీ సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కూడా ఖరారు చేసిన తరువాత కూడా ఇన్నిసార్లు ఉరిశిక్ష వాయిదాపడటం ఎన్నడూ చూడలేదని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. ఈసారైనా దోషులకు ఉరిశిక్ష అమలవుతుందని భావిస్తున్నామని నిర్భయ తల్లితండ్రులు అన్నారు.