తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి 6 నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. కానీ కాంగ్రెస్, బిజెపిలకు ఎమ్మెల్యేల బలం లేనందున టిఆర్ఎస్ ఒక్కటే నామినేషన్లు వేస్తుంది. అంటే సిఎం కేసీఆర్ ఖరారు చేసిన అభ్యర్ధులే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవనున్నారన్న మాట. వాటిలో ఒకటి మాజీ ఎంపీ కవితకు ఇవ్వాలని సిఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక మిగిలిన ఒక్క సీటు కోసం త్వరలో పదవీవిరమణ చేయబోతున్న రాజ్యసభ సభ్యుడు కే కేశవ్రావుతో సహా టిఆర్ఎస్లో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. వారిలో మాజీ ఎంపీలు సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎస్సీ సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే కడియం శ్రీహరికి, ఎస్టీకైతే సీతారాం నాయక్ ఇచ్చే అవకాశం ఉంది. వారికి కాదనుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ముగ్గురిలో ఎవరికి ఆ సీటు దక్కనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.