గత నాలుగైదు దశాబ్ధాలుగా పాకిస్తాన్ భారత్పైకి ఉగ్రవాదులను పంపించి దాడులకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దు గ్రామాలలోని మన ప్రజలను, మన సైనికులపై దాడులు చేస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్లో వేర్పాటువాదులను ప్రోత్సహించి కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు విఫలయత్నాలు చేస్తూనే ఉంది. భారత్ కూడా అదేవిధంగా ప్రవర్తించవచ్చు కానీ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా అందరూ పాకిస్థాన్కు స్నేహహస్తం అందిస్తూనే ఉన్నారు.
నరేంద్రమోడీ కూడా ప్రధాని పదవి చేపట్టినప్పుడు పాకిస్థాన్కు స్నేహహస్తం అందించారు. కానీ పాక్ తన వక్రబుద్దిని ప్రదర్శించడంతో ఆయన కూడా పాక్ను దూరం పెట్టారు. కానీ అంతమాత్రన్న పాక్ ప్రజల పట్ల తనకేటువంటి ద్వేషమూ లేదని పదేపదే చెప్పారు కూడా. ఈరోజు భారత్ విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ చేసిన ప్రకటన అందుకు తాజా నిదర్శనం.
చైనాలో వ్యూహాన్ నగరంలో కరోనా వైరస్ కోరాలలో చిక్కుకొని విలవిలలాడుతున్న వారిలో అనేకదేశాల విద్యార్దులు ఉన్నారు. వారిలో పాక్ విద్యార్ధులు కూడా ఉన్నారు. భారత్తో సహా చాలా దేశాలు వ్యూహాన్కు విమానాలు పంపి తమ విద్యార్ధులను వెనక్కు తెచ్చుకోగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం పాకిస్తాన్కు అంత శక్తి లేదంటూ చేతులు దులుపుకోవడంతో పాక్ ప్రజలు ఆయనపై మండిపడుతున్నారు. కానీ పాక్ ప్రభుత్వం మాత్రం వ్యూహన్లోని తమ విద్యార్దులను వెనక్కు రప్పించుకొనేందుకు ఈరోజువరకు విమానం పంపించలేదు. దాంతో పాక్ విద్యార్దులు వ్యూహాన్లో చిక్కుకొని భయంభయంగా రోజులు గడుపుతున్నారు. వారి పరిస్థితిని గమనించిన భారత్ విదేశాంగమంత్రి జైశంకర్ వారందరినీ పాకిస్థాన్కు తీసుకువచ్చేందుకు కావాలంటే విమానం పంపించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలియజేశారు.
పాక్ నిత్యం భారత్పై దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతుంటే భారత్ ప్రభుత్వం విభేధాలను పక్కనపెట్టి ఈవిధంగా మానవతాదృక్పదంతో స్పందించడం చాలా హర్షణీయం.