ఏపీ రాజధానిని విశాఖకు తరలింపు, శాసనమండలి రద్దు వ్యవహారాలపై గత కొన్ని రోజులుగా టిడిపి, వైసీపీ నేతల మద్య జోరుగా మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డికి కుడిభుజంగా వ్యవహరిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు చంద్రబాబునాయుడును ఉద్దేశ్యించి ట్విట్టర్ వేదికగా కీలకవ్యాఖ్యలు చేశారు.
“మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుల ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది. సీఎం హోదాను సైతం అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బండారం బయటపడితే ఎలాగూ జైలుకు పోయేదేకదా అని చంద్రబాబునాయుడు పిచ్చి కూతలు కూస్తున్నారు. మీ రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి,” అని ట్వీట్ చేశారు.
ఇంతకు ముందు ఏపీలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తున్నట్లు చంద్రబాబునాయుడు తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ముందుగా సమాచారమివ్వడంతో వారందరూ అమరావతిలో రైతుల నుంచి కారుచవుకగా వేలాది ఎకరాలు భూములు కొనుగోలు చేశారని, అందుకే వారు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి రాగానే ఈ భూముల కొనుగోలు (ఇన్సైడర్ ట్రేడింగ్) వ్యవహారంపై సీఐడీ పోలీసుల చేత విచారణ జరిపించి ఆ కేసులను ఈడీకి అప్పగించింది. వాటి ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. కనుక చంద్రబాబునాయుడుతో సహా అమరావతిలో భూములు కొన్న టిడిపి నేతలందరూ జైలుకు వెళ్ళడం ఖాయమని వైసీపీ భావిస్తోంది.
అయితే తాము ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడలేదని, తమపై రాజకీయకక్ష సాధించడం కోసమే జగన్ ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టిందని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని చంద్రబాబునాయుడు చెపుతున్నారు.