సూర్యాపేట జిల్లాలోని కొత్తగా ఏర్పాటైన నేరేడుచర్ల మునిసిపాలిటీ కూడా టిఆర్ఎస్ చేతికే వచ్చింది. టిఆర్ఎస్, కాంగ్రెస్ల బలాబలాలు సరిసమానంగా ఉండటంతో టిఆర్ఎస్ నిన్న రాత్రి ఎమ్మెల్సీ శేరి సుబాష్ రెడ్డి పేరును ఎక్స్అఫిషియోగా ఓటర్ల జాబితాలు చేర్పించడంతో టిఆర్ఎస్ బలం 11కు చేరింది. దానిపై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు తీవ్ర అభ్యంతరం చెప్పినప్పటికీ రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలుపడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ నిరసన తెలియజేస్తూ సమావేశం నుంచి వాకవుట్ చేశారు. దాంతో ఏడుగురు టిఆర్ఎస్ కౌన్సిలర్లు, నలుగురు ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లతో టిఆర్ఎస్ కౌన్సిలర్ చందమల్లు జయబాబు మునిసిపల్ ఛైర్మన్, శ్రీలత వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. దీంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీకి చేతికి అందివచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. ఉత్తమ్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నేరేడుచర్ల మునిసిపాలిటీ కార్యాలయం బయట కూర్చొని నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే నిరసనలతో తమ ఆక్రోశం వెళ్ళగక్కుకోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదని వారికీ తెలుసు.