లోక్సభ ఎన్నికలలో నిజామాబాద్ టిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించినందుకు ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలలో బిజెపిపై టిఆర్ఎస్ ప్రతీకారం తీర్చుకొంది. మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీతో కలిసి నిజామాబాద్ మునిసిపల్ కార్పోరేషన్, జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలను కూడా గెలుచుకొంది.
టిఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు కలిసి మేయర్, డెప్యూటీ మేయర్ పదవులు దక్కించుకొన్నాయి. మేయరుగా 11వ వార్డు టిఆర్ఎస్ కార్పొరేటర్ దండు నీతూ కిరణ్, డెప్యూటీ మేయర్గా 14వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇద్రీస్ ఖాన్ (మజ్లీస్) ఎన్నికయ్యారు.
అయితే మేయర్, డెప్యూటీ మేయర్ పదవులకు బిజెపి కార్పొరేటర్లు కూడా గట్టి పోటీనిచ్చారు. మేయర్ పదవికి పోటీపడిన బిజెపి కార్పొరేటర్ లావణ్యకు 29, డెప్యూటీ మేయర్ పదవికి పోటీపడిన బిజెపి కార్పొరేటర్ మల్లేశ్ యాదవ్కు 29 ఓట్లు పడ్డాయి. కనుక నిజామాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ను బిజెపి చేజిక్కించుకోలేకపోయినప్పటికీ జిల్లాలో బలం పెంచుకోగలిగిందని అర్ధమవుతోంది.