తెలంగాణ ఏర్పడినప్పటికి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆర్ధికంగా చాలా బలంగా ఉండేది కనుక ఆ సమస్యలన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరిస్తూనే సమాంతరంగా లక్షలకోట్లు వ్యయంతో అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలను కూడా ప్రభుత్వం అమలుచేయగలిగింది. అంతేగాక ప్రగతి భవన్, సమీకృత కలక్టరేట్ కార్యాలయాలు, కొత్త జిల్లాలో పోలీస్ కార్యాలయాలు, మార్కెట్ యార్డులు, 119 మంది ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాలలో క్యాంప్ కార్యాలయాలు, హైదరాబాద్లో సకల సౌకర్యాలతో విలాసవంతమైన క్వార్టర్స్ ప్రభుత్వం నిర్మించగలిగింది. వందల కోట్లు వ్యయంతో కొత్త సచివాలయం, అసెంబ్లీ, మండలి భవనాలను నిర్మించడానికి కూడా ప్రభుత్వం సిద్దమైంది.
కానీ ఆర్ధికమాంద్యం కమ్ముకోవడం, జీఎస్టీ పన్నులలో రాష్ట్రానికి రావలసిన వాటా కేంద్రప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రాష్ట్ర ఆర్ధికపరిస్థితి తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అయినప్పటికీ తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా అమలుచేయక తప్పదు కనుక ఇకపై ప్రభుత్వంలో అన్ని శాఖలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అన్ని శాఖలకు బడ్జెట్లో కేటాయించిన నిధులను ఆ పనుల కోసం మాత్రమే వినియోగించాలని, వృధా ఖర్చులు అరికట్టాలని సిఎం కేసీఆర్ ఆయా శాఖల మంత్రులను, ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.
ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన సుమారు 5 గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆ వివరాలు...
1. దుమ్ముగూడెంలో గోదావరి నదిపై రూ.3,482 కోట్లు వ్యయంతో బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం. దాని నిర్మాణానికి అవసరమైన నిధులను రాగల రెండేళ్ళలో బడ్జెట్లో కేటాయించబడతాయి. ఈ బ్యారేజీ ద్వారా 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలి.
2. లోకాయుక్త చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేసింది.
3. చెంగిజర్లలో చైనాకు చెందిన లులూ గ్రూప్ పరిశ్రమ స్థాపించడానికిగాను లీజు పద్దతిలో భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపింది.
4. గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రతలను పెంచేందుకుగాను జనవరిలో మళ్ళీ 10రోజలు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టాలి.
5. జీఎస్టీ పన్నులలో రాష్ట్రానికి రావలసిన వాటా కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం.