బిజెపి అజెండాలో పేర్కొన్న ట్రిపుల్ తలాక్పై నిషేదం, జమ్ముకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, అయోధ్య రామజన్మ భూమి వివాదం పరిష్కారం మొదలైన అంశాలను మోడీ ప్రభుత్వం ఒకటొకటిగా అమలుచేయడం అందరూ చూశారు. తాజాగా పౌరసత్వ సవరణల బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. శనివారంలోగా ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్దం అవుతోంది. కీలకమైన ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు బిజెపి సభ్యులు అందరూ విధిగా సభకు హాజరవ్వాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు.
ఈ బిల్లు ప్రధానంగా ఇరుగు పొరుగు దేశాల నుంచి అక్రమంగా భారత్లో ప్రవేశించి స్థిరపడినవారిని గుర్తించి వారిని స్వదేశాలకు తిప్పి పంపించేయడానికి ఉద్దేశ్యించబడినది కావడంతో వాసవాదులు ఎక్కువగా స్థిరపడిన అసోం తదితర ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారు అక్రమంగా నివశిస్తున్నారనే వాదనలు వినిపోయిస్తున్నాయి. కనుక ఒకవేళ ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే వలసవాదుల ఎరివేత కార్యక్రమం మొదలవవచ్చు.
“భారతీయులు కానివారు ఎవరైనా సరే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే... దానికి కొన్ని పార్టీలు ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నాయో తెలియదని” కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఈ బిల్లు ద్వారా ఇరుగుపొరుగు దేశాలలో మతపరమైన వేదింపులకు గురవుతున్న ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పించబోతోంది. భారత్ పౌరసత్వం పొందేందుకుగాను గతంలో ఉన్న కొన్ని నిబందలను ఈ బిల్లు ద్వారా సరళీకరించబోతోంది.