ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బిజెపి నేత పొంగులేటి సుధాకర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, “యావత్ దేశమంతటా బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలవుతుంది. దానిలో బై ది కేసీఆర్.. ఆఫ్ ది కేసీఆర్..ఫర్ ది కేసీఆర్..అన్నట్లు సాగుతోంది. దానిని అందరూ పాటించవలసిందే తప్ప ఎవరూ ప్రశ్నించడానికి లేదు. రాష్ట్రంలో 50,000 ఆర్టీసీ కార్మికులు సుమారు రెండు నెలలుగా సమ్మె చేస్తే వారిని ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి వాళ్ళు బేషరతుగా సమ్మె విరమించి విధులలో చేరేందుకు వచ్చినా చేర్చుకోకుండా పోలీసుల చేత అరెస్టులు చేయించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇకనైనా ఆర్టీసీ కార్మికుల పట్ల సిఎం కేసీఆర్ కాస్త మానవతాదృక్పదంతో ఆలోచించి తక్షణమే ఉద్యోగాలలోకి తీసుకోవాలి,” అని పొంగులేటి అన్నారు.